
కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలలో విరివిగా ఉపయోగించే ఉపాంగ రాగం హంసధ్వని. ఇది 29వ మేళకర్త శంకరాభరణ జన్యరాగం. ఈ ఔడవ రాగం ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి గారైన శ్రీ రామస్వామి దీక్షితార్ సృష్టి. ఇది ప్రాచీన గ్రంధాల్లో మనకు కన్పించదు. ఈ రాగం అన్నివేళలా పాడుకోడానికి అనువైనది. ఈ రాగంలో గణపతిని ప్రార్ధిస్తూ అనేక కృతులు వాగ్గేయకారులు ఆలాపించారు. వీటిలో ‘వాతాపి గణపతిః’ ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకలినిషాదం (స,రి,గ,ప,ని,స / S R2 G3 P N3 S). ఆరోహణ, అవరోహణలు: సరిగపనిస, సనిపగరిస. హిందుస్తానీ సంగీతంలో సరితూగే రాగం ఏదీ లేదు. అయితే బండిబజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అమన్ ఆలీఖాన్ ఈ రాగాన్ని ఉత్తరాదిలో బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. సంగీత కచేరీల్లో హంసధ్వని రాగాన్ని సభారంభంలో ఆలపిస్తుంటారు. ఇందు హాస్య, వీర రసాలు రక్తికడతాయి.
చలనచిత్రాల్లో ప్రయోగాత్మకంగా భక్తి భావాన్ని వ్యక్తపర్చటానికి, జావళీలకు వినియోగించారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి వాతాపి గణపతిః కీర్తనను యథాతధంగా అనువాదం చేసి ‘పరిహార్’ చిత్రంలో లతా, మన్నాడేల చేత పాడించారు.
ఈ రాగంలో వెలువడ్డ ప్రముఖ కృతులు:
రఘనాయకా నీపాదయుగ, శ్రీ రఘుకులమందు బుట్టి,– త్యాగరాజు
వాతాపి గణపతిః – ముత్తుస్వామి దీక్షితార్
వర్ణముఖ వా – కోటేశ్వర అయ్యర్
మూలాధార మూర్తి, కరుణై సేవై – పాపనాశం శివన్>
గజవదన బేడువే – పురందరదాసు
వరవల్లభ రమణ – జి ఎన్ బాలసుబ్రహ్మణియమ్
గమం గణపతే – ముత్తయ్య భాగవతార్
పాహి శ్రీపతే – స్వాతి తిరునాళ్
వందేహం జగద్వల్లభం — అన్నమయ్య
వినాయక – వీణ కుప్పయ్య
మనసుకరుగదేమి, పగవారు (వర్ణం) – పట్నం సుబ్రహ్మణ్యయ్యర్
గాయియే గణపతి జగ్ వందన్ – తులసీదాస్
షోడశ కళా పరిపూర్ణ నమో – శ్రీకాంత కృష్ణమాచార్యులు (క్రిష్ణమయ్య)
ఈ రాగంలో సినీగీతాలు:
శ్రీ రఘురాం జయరఘురాం – శాంతినివాసం
తరలిరాదతనే వసంతం – రుద్రవీణ
ఈనాడే ఏదో అయ్యింది – ప్రేమ
నాయింటి ముందున్న పూదోటనడిగావో — జెంటిల్మెన్
మౌనంగా గానం మధురం మధురాక్షరం – మయూరి
మనసు దోచే దొరవునీవే – యశోద కృష్ణ
స్వాగతం, సుస్వాగతం – శ్రీ కృష్ణపాండవీయం
గోపాలా ననుపాలింపరార – మనుష్యుల్లో దేవుడు
జాతో నహి బోలు కన్నయ్య – పరిహార్
ఓ చాంద్ జహాన్ వోహ్ జాయే, కరంకి గతిన్యారి — శారద
బిలహరి:
ఇది 29వ మేళకర్త ధీరశంకరాభరణ జన్యరాగం. ఇది ఔడవ – సంపూర్ణ భాషాంగ రాగం ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కాకలినిషాదం (స,రి,గ,మ,ప,ద,ని,స / S R2 M1 G3 P D2 N3 S). ఆరోహణ, అవరోహణలు: సరిగపదస, సనిదపమగరిస. ఇందు కైశిక నిషాదం కూడా అప్పుడప్పుడు అన్యస్వరంగా వస్తుంది. ఇది ఉదయమున పాడదగిన రాగం. ఉత్సాహమును, వీరాన్ని కలుగచేసే ఈ రాగం గమక వరిక రక్తి రాగం. ఈ రాగము ప్రాణమునచ్చే సంజీవినీ రాగమని ప్రసిద్ధి. త్యాగరాజు ఈ రాగంలో ‘నీ జీవాధార’ అనే కృతిని ఆలపించి మృతిచెందిన బ్రాహ్మణుని సజీవుని చేశారని ప్రతీతి.
శ్లోకాలు, పద్యాలు పాడటానికి అనువైన ఈ రాగం పద్యనాటకాల ద్వారా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ రాగం నాదస్వరం వాయించేవారికి ఎంతో ఇష్టమైన రాగం. ఇది ఉదయరాగం. హిందుస్తానీలో దీన్ని సరిపోలే రాగం ‘ఆలైయా బిలావర్’. ఈ రాగంలో సంగీత ప్రారంభదశలో ‘రారావేణు గోపబాల’ గోపాలయ్య సర్వరచన చేసిన స్వరజతిని, వీణకుప్పయ్యర్ రచన ‘ఇంతచౌకసేయ’ అనే వర్ణాన్ని విద్యార్ధులకు నేర్పుతారు.
ఈ రాగంలో ప్రఖ్యాతినొందిన రచనలు:
దొరకునా ఇటువంటి సేవ, కనుగొంటిని శ్రీరాముని, నా జీవధార, నరసింహా నన్ను – త్యాగయ్య
పరిదానమిచ్చితే పాలింతువేమో – పట్నం సుబ్రహ్మణ్యయ్యర్
కామాక్షివరలక్ష్మి, హటకేశ్వర, శ్రీబాల సుబ్రహ్మణ్య – ముత్తుస్వామి దీక్షితార్
ఇంతపరాముఖ, ఇంతచౌక (వర్ణం) – వీణ కుప్పయ్య
పూరయమమ – నారాయణతీర్ధులు
ఎ షుందాళే పూంగోదే – అరుణాచల కవిరాయరుగారి రామనాటకములో రచన.
రారాగురు రాఘవేంద్ర — బాలమురళీకృష్ణ
ఈ రాగంలో సినిగీతాలు
ఎవరునేర్పేరమ్మ ఈ కొమ్మకు – ఈనాటి ఈ బంధమేనాటిదో
నీతోనె ఆగేన బిలహరి – రుద్రవీణ
ఏదో, ఏదో అన్నది ఈ మసక, మసక వెలుతురు – ముత్యాలముగ్గు
రండయ్య పోదాము – రోజులు మారాయి
కలడందురు దీనులయెడ (పద్యం) – భక్త ప్రహ్లాద
కొళ్లాయి గట్టితి, కోక జుట్టితి (పద్యం) – భక్త పోతన
సౌమ్యశ్రీ రాళ్లభండి