
జగదానందకారక, కనకన రుచిరా కృతుల్లో ప్రత్యక్షం చేసుకున్న పరమాత్మ తనను రక్షించి దయతో బ్రోచునా అనే సందేహాన్ని, గౌళరాగంలో ‘‘దుడుకు గల’’ అనే కృతిలో ప్రస్తావిస్తారు త్యాగరాజస్వామి. ‘కనకనరుచిరా’ అన్నపాటలో చివర ఉదహరించుకున్న ధ్రువుడు సజ్జనుడు, సాపత్నిమాతయైన సురుచి కర్ణశూలములైన మాటలు, వీనులచురుక్కుమనిపించినా, పల్లెత్తుమాటైనా తిరిగి అనకుండా కార్యశూరుడైన, వినయకవచుడై కృతకృత్యుడైన ప్రయోజకుడు ఆ ధ్రువుడు! అలా ధ్రువోపాఖ్యానం జ్ఞాపకం తెచ్చుకున్నా ప్రస్తుతః తాను ఆ ధ్రువునికి సమానుడను కానన్న కించవల్ల తన కాతని మల్లె సమానఫలసిద్ధి అబ్బదేమో అనే సందేహం కలిగింది. తనకు దుడుకు ఉన్నదని ఆలోచించుకుంటారు. తన స్థితిని పూర్తిగా వివరించుకునే ప్రయత్నంచేసి, ఆ ప్రయత్నంలో పదేపదే తన్ను కించపరచుకుంటారు ఈ గౌళకృతిలో.
సౌఖ్యపుజీవనం కోసమే కాలం గడుపుతూ, దుర్విషయములను దురాశలను విసర్జించలేక, పరధనముల నాశించి, వానికొరకు ఇతరులను పొగడి, మది కరుగ యాచించి పలికి, కుతర్కుడై, రసవిహీనుడై, కులభ్రష్టుడై కాలము గడిపే దుడుకు మానవతను సాధింపక, చపలచిత్తుడై, మదమత్సర కామలోభమోహములకు దాసుడై, చిరుతప్రాయమునాడే భజనామృతసారవిహీనుడై, సతతమపరాధియైనట్టి వాని దుడుకు సతులకై కొన్నాళ్లు, ఆస్తికై కొన్నాళ్లు, ధనతతులకై కొన్నాళ్లు, తిరిగి శ్రమిస్తూ, పరస్త్రీలను, నీచ స్త్రీలను కామించి అనుభవించి, శ్రీహరిపదాబ్జభజన మరచి, సకలభూతలములయందూ తానైయున్న ఆ దేవుని తన మదిలో మాత్రమే లేకుండ చేసుకున్న దుడుకు ఈ రీతిగ అనేక రకముల దుడుకులు గల ‘తన్ను’ నికృష్ణుని, ‘బ్రోచే దొరకాడు’ వారసత్వపు ప్రభుత్వంగల వాడెవ్వడూ అని ప్పచ్ఛ చేస్తారు. ఈ ప్రశ్నకు జవాబు ఈ పాటలో లేదు. కాని నాలుగువ పంచరత్న కీర్తన, ఆరభిరాగంలో ‘‘సాధించెనే మనసా’’ అనే కృతిలో సంతరించారు త్యాగరాజస్వామి.
ఈ గౌళ కీర్తన యొక్క ప్రయోజనం అంతముఖ్యమైన ప్రశ్నను రేకెత్తించడమే. త్యాగరాజు స్వకీయనిందమాత్రం కాదు. ఆ పరమ భాగవతుడు తన్నంతగా కించపరచుకుని తిట్టుకోవడం సమంజసమూ కాదు. అటువంటి దుడుకాయనకున్నదనడం సత్యమూ కాదు. స్వామివారి సత్ప్రవర్తనా, పవిత్ర జీవినమూ అందరూ ఎరిగినవే. వేరొకచోట స్వామివారు త్యాగరాజప్తునిగా శ్రీరాముణ్ణి పొగడడం నారదమౌని తపస్సుకే ఫలపరమావధి అన్నట్టు చెప్పారు. త్యాగరాజు శబ్దం శివునికి కూడా వర్తించినా కృతులలో అది తన సంతకమే, తను రచించిన విషయాన్ని సూచించే సంకేతమే అవుతుంది. ‘‘త్యాగరాజాప్తయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో’’ అని యదుకులకాంభోజిలో అనేసి తనపై తనకున్న ఆత్మ విశ్వాసాన్ని ప్రకటితం చేశారు. కనుక ఈ గౌళరాగకృతిలోని ‘‘దుడుకు మానిసి’’ త్యాగరాజస్వామి మాత్రం కాకూడదు. ఆ పాట నేను పాడుకుంటే ఆ ‘నన్ను’ నాకే చెంది ఆ దుడుకుగల మనిషిని, కొన్ని దుడకులేనా ఉన్న మనిషిని నేనే అవుతాను. అంచేత ఆ పాట పాడుకునే జిజ్ఞాసువులకు ఆ మాట చెందుతుంది. ఇక పాటలోని ప్రతిపాదనా, ప్రశ్నా జనసామాన్యానికి అన్వయించుకుంటే, అంత హైన్యస్థితికి దిగజారిన వారికి మోక్షం ఎలాగా అనే సామాన్య ప్రశ్నా, దానికి జవాబూ దొరుకుతాయి. తానెంత దైన్యస్థితికి దిగజారినా, ఎంతు బరువు బ్రతుకు గడుపుతున్నా, ఎంత నికృష్టుడైనా ఏ మానవుడు నైరాశ్యత చెందరవసరంలేదనీ, బ్రోచి రక్షించే దొరకొడుకు ఎవరు అని వెతుక్కుంటే దొరకుతాడనీ వ్యంగ్యంగా సూచించారు గురూత్తములైన త్యాగరాజస్వామి. ‘జగదానందకారక’ లోని శరణాగత జనపాలకుడూ, ‘కనకన రుచిరా’ లోని పరమదయాకర, కరుణాకరసవరుణాలయుడూ అయిన జానకీ ప్రాణనాయకుడే ఆ దొరకొడుకు! దశరధ దొరకొడుకు – దాశరధి!
‘‘సాధించెనే మనసా’’లో ఆ దొరకొడుకైన దాశరధి, త్యాగరాజనుతుడు. తన భక్తుని చెంతరాకనే, అమరికగా నాతని పూజగొని, సమయానికి తగు మాటలాడి, సౌఖ్యపు బ్రతుకు గడపడానికి ప్రయోజనకారకములయ్యే వ్వహార సూత్రాలు నిర్ధేశిస్తాడు. ఆ భగవంతుడు ముచ్చటగా మూడే సూత్రాలు చెప్పాడు:
అలుగవద్దు, అన్నాడు
విముఖులతో చేరబోకు, అన్నాడు
వెతగలిగితే తాళుకొమ్ము, అన్నాడు
రఘుకులేశుడైన రామచంద్రుడు, స్వప్రకాశుడైన శ్రీవేంకటేశుడు వేడుకున్నా తన్నుబ్రోవక, ఈ మూడు సూత్రాలు పలికి తిరిగిపోయినాడన్నారు. పరమభక్తవత్సలుడని, కలబాధల దీర్చువాడని, ఒక అభయహస్తముద్రతో తన్ను తిన్నగా మోక్ష స్థితికే చేర్చివేస్తాడనుకొని వేడుకుంటే, దగ్గరకైన రాకుండానే, దూరాన్నే నిలిచి, ఈ ప్రకారంగా నడచుకొమ్మని ఉపదేశించి చక్కా పోయినట్లు చెప్పి, చమత్కారంతో విశేష ప్రయోజనం సాధించారు. దేశికోత్తములైన త్యాగరాజస్వామి! ఏ ఆచార్యుడైనా జీవిత క్రమానికి సంబంధించిన నిబంధనలు వక్కాణించి చెప్పితే, అవి సామాన్యంగా శిష్యుల మనస్సులకెక్కవు. కాని త్యాగరాజస్వామి వంటి సద్భక్తుడు, తనకు, ఆ పరబ్రహ్మమైన శ్రీవేంకటేశుడే అయీ నిబంధనలని సూచించాడని చెప్పుతూ ఉంటే, ఆ పరదైవాన్ని ప్రత్యక్షదైవంగా ఎంచుకునే కలియుగ మానవులు ఆ మాటలపై నమ్మకమూ, స్వామివారిలో గురుత్వమూ కుదుర్చుకొనకుండా ఎలా ఉండగలరూ? తాను చెప్పదల్చుకున్న పాఠాన్ని పరోక్షంగా, అందులోనూ ఆ పరమాత్మ నోటితోనే చెపన్పించడం త్యాగరాజస్వామి వారి నేర్పరితనం. ‘‘శాంతము లేక సౌఖ్యము లేదు’’ అని వేరొకచోట తానై వితర్కించుకొన్న త్యాగరాజస్వామి ఈ పంచరత్న కృతిలో, ‘అలుగవద్దు’ అని దేవదేవుని చేతనే (మళ్లీ) చెప్పించారు.
ఈ పాటలో ఇంకొక చమత్కారం ఏమిటంటే, ఆ చెప్పిన పరమాత్ముడు, సమయానికి తగరుమాటలాడినవాడూ, మామూలుగా తాను పూజించి, మనస్సులో దర్శించి పరవశం చెందే జానకీ ప్రాణనాయకుడుకాదు –రుక్మిణీ ప్రాణేశుడు! రంగేశుడూ, సద్గంగా జనేకుడూ, సంగీత సాంప్రదాయకుడూ అయిన శ్రీ కృష్ణుడు ఆ శ్రీకృష్ణుడైనా, తానూ ఇంకా మిగిలిన భక్తులై ఈ వరలో సందర్శించిన మూర్తి. ‘‘అలివేణువెల్ల దృష్టిచుట్టి వేయుడు, మ్రొక్కే వేణుగానలోలుడు కాడు – రాసక్రీడలాడే యువకుడుకాడు – పెంకెగోపాలుడు. గోపీజన మనోరధ మొసంగలేకనే గేలియజేసెడివాడు, పుట్టిన మరుగడియనుండీ వారికి గాక పరులవాడై దేవకీ వసుదేవుల ‘‘నేచిన’’ వాడు, నిజతనయుడను భ్రాంతితో యశోద ముదంబునను ముద్దుబెట్ట (ఆవిడ మాయామోహత్వానికి) నవ్వుచుండు హరి, వనితల సదా సొక్క చేయుడు, అందులకై తనకు మ్రొక్కించుకునే గడుసిరి, ‘అలుగవద్దు’ అని తనకు బోధించిన సన్మార్గ వచనములను (తానే) బొంకుజేసి తాపట్టిన పట్టు (దూరాన్నుంచి కబుర్లు చెప్పడమేగాని, దగ్గరకొచ్చి, లాలించి ప్రేమించి మోక్షమీయని పెంకెపట్టు – తానే కోపించినాడా అన్నట్టు) అలాంటి పట్టును ‘‘సాధించెనే’’ అంటారు త్యాగరాజస్వామి! ఆ మాటను పల్లవిలోనే అని మళ్లీమళ్లీ అనుకుంటారు! ఇటువంటి విరుద్ధ ప్రవృత్తితో పరమాత్ముడు తనకు ప్రత్యక్షమయ్యాడన్నారు. తాను కోని పూచించుకునే ఇష్టదైవం వేరు – ఉరమున ముత్యపుసరులచయముతో, కరమున శరకోదండకాంతితో, రుక్కలరాయని గేరుమోముగల సుదతి సీతమ్మ, సౌమిత్రి ఇరుప్రక్కల నిలబడి సేవించే ఆ వనజనయనుడు కాడు! ఆ స్థానంలో ఈ గోపాలుని నిలుపుకొనడంలో త్యాగరాజస్వామి వారందించే పాఠం ఏమిటో మనం ఊహించుకోవాలి. ఆశించిన ఫలం అదే రూపంలో అందకపోతే క్రుంగిపోకూడదు అనే పాఠాన్ని అందించారా? కావాలన్నప్పుడూ, అనుకొన్న రూపంలో దేవుడు దొరకకపోవచ్చుననీ, ఇంకో రూపంలో ప్రత్యక్షం కావచ్చుననీ, స్వర్గానికి నిచ్చెనగా దేవతామూర్తి నుపయోగించుకోబోతే, పెంకె గోపాలునిమూర్తిలో ప్రధానోపాధ్యాయుని లాగా, జాగ్రత్తగా మసలుకొమ్మని పాఠాలు చెప్పవచ్చుననీ, అయినా ఆ బోధనే మహా ప్రసాదమని స్వీకరించానీ, అలాంటి సత్ప్రవర్తన వల్లనే విముక్తి దొరుకుతుందనీ చెప్పడమే త్యాగరాజుల వారి తాత్పర్యమేమోననిపిస్తుంది. ఇంకొక ఆలోచన అతుల శౌర్య విభాసియైన పార్ధుని కనిమొనలో సారధ్యమొనరించి, అతడు విషాదయోగగ్రస్తుడై యుండగా, కర్తవ్యము నుపదేశించిన దేశికమూరి, జగత్తుకు గీతామృతమును ప్రసాదించిన జగద్గురువు, ఆ శ్రీకృష్ణుడు గనుక, గీతాబోధను గుర్తులో నుంచుకొని, తన రామునిచే పాఠాలు చెప్పించక, ఆచార్య స్థానంలో ఆ కృష్ణుని నిలబెట్టడం సమంజసమే అనిపిస్తుంది. ఏదిఏమైనా, సుశీలమే ఆవశ్య కర్తవ్యమని, త్రిసూత్రాత్మకమైన గురు బోధను అందించింది ఈ ఆరభి రాగపుటమోఘ కీర్తన!
(సేకరణ: యువభారతివారి త్యాగరాజస్వామి కవితా వైభవము నుంచి)
తేటగీతి